'శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో గాజువాక డిపో లేడీ కండక్టర్ మాస్ డ్యాన్స్


 విశాఖపట్నం: బుల్లితెరపై అలరిస్తున్న ఎంటర్టైన్మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుండి తెలుగు ప్రేక్షకుల చేత మంచి ఆదరణ దక్కించుకుంటోంది. అయితే సుధీర్ హోస్ట్ గా మొదలైన ఈ షోకి కొన్ని వారాలుగా రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తోంది. 
ఇక మొన్నటివరకూ శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జిగా హీరోయిన్ పూర్ణ, నటి ఇంద్రజ సందడి చేశారు. ఈ వారం జడ్జిగా నటి ఆమని సందడి చేయనుంది. తాజాగా ఈ షోకి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ప్రోమో మొదటి నుండి చివరివరకు చాలా ఎనర్జిటిక్ గా సాగింది. మధ్యలో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ ల కామెడీ బాగుంది. మధ్యలో శ్రీకాకుళం ఫోక్ సాంగ్స్, తెలంగాణ జానపద పాటలు కూడా అలరించాయి. అయితే వీటన్నిటికీ మించి ఓ లేడీ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఒక్కసారిగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మాంచి ఊపున్న ఫోక్ సాంగ్ కి టీమ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది గాజువాక పట్టణానికి చెందిన బస్ కండక్టర్. ఆమె చేసిన మాస్ డ్యాన్స్ కి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. ఆ తర్వాత జడ్జి ఆమనితో పాటు యాంకర్ రష్మీ, హైపర్ ఆది, చంటి, రాంప్రసాద్ ఇలా స్టేజిపై ఉన్నటువంటి జెన్స్ అందరితో స్టెప్పులేసి అదరగొట్టింది ఆ లేడీ కండక్టర్. ఇదిలా ఉండగా ఆమె పేరు ఝాన్సీ అన్నట్లు సమాచారం. 
ప్రస్తుతం ప్రోమోలో ఝాన్సీ మాస్ డ్యాన్స్ చూశాక  ప్రేక్షకులలో పూర్తి ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో గాజువాక లేడీ కండక్టర్ డ్యాన్స్ తెగ ట్రెండ్ అవుతోంది.