భీమునిపట్నం జనసేవ న్యూస్:
గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి జివిఎంసి పరిధి 1వ వార్డు లోని వెలంపేట, సంతపేట, కొత్తపేట ప్రాంతానికి విచ్చేసిన స్థానిక మాజీ మంత్రివర్యులు,ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కు స్వాగతం పలకడానికి ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల స్థానిక ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ స్వాగతం పలికి గౌరవించు కోలేక పోయిందని టిడిపి విశాఖ పార్లమెంటరీ సెక్రటరీ పిట్ట సురేష్ తెలిపారు. సోమవారం స్థానిక ఒకటో వార్డు టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో స్థానిక సమస్యలు పరిష్కరించడం లో ఒకటో వార్డు నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ఆరు వేలు మంది కార్మికులతో ఉన్న చిట్టివలస జూట్ మిల్ మూత పడి ఉపాధి కోల్పోయారని,టిడ్కో ఇళ్ళు కోసం డి. డి. లు కట్టిన వారికి ఇల్లు ఇప్పించి గృహప్రవేశాలు చేయలేకపోయారన్నారు.
రోజువారీ కూలీలు, రైతు కూలీలకు కేంద్రమైన తగరపువలస లో ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ మూయించ వేయడం తో వారి నోటికి మట్టి కొట్టినట్టైంది అన్నారు. అలాగే
టూరిజం మంత్రిగా ఉన్నప్పుడైనా చిట్టి వలస చెరువును అభివృద్ధి చేస్తారు అనుకున్న ప్రాజెక్టు అలాగే ఉందని, జూనియర్ కళాశాల కోసం ఎదురు చూస్తున్నా విద్యార్థులకు నిరాశే మిగిలిందన్నారు.
చుట్టుపక్కల ఉన్న సుమారు 200 గ్రామాలకు వాణిజ్య కేంద్రం - తగరపువలస లో ఆర్టీసీ కాంప్లెక్స్ కలగానే మిగిలిందన్నారు.
శుద్ధమైన తాగునీరు అందించడానికి ఫిల్టరైజేషన్ ప్లాంటు అవసరమని తెలుసుకోవడానికి మాత్రమే పరిమితం అయిందని,
ప్రజలకు కావాల్సిన ఉపాధి, గృహం, మంచినీరు, విద్య ,రవాణా, పార్కులు, క్రీడామైదానం ఇలా చాలా వున్నా కేవలం ఒకట్రెండు సంక్షేమ కార్యక్రమాల కోసం అడిగి వెనుదిరిగారని మాకు కొన్ని పథకాలు అందడం లేదని అడిగిన వారిపై వైసిపి నాయకులు దాడికి దిగుతున్నారని, వారిని తెలుగుదేశం వారిగా ముద్ర వేస్తున్నారన్నారు
ప్రజలు గాని, ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ గాని తెలియచేసినవి ప్రజావసరాలు కావా? అన్నారు. ఇన్ని సమస్యలు ఉన్న జివిఎంసి పరిధిలో గడపగడపకు విచ్చేసి మా గోడును వినడానికి వచ్చిన మిమ్ములను సత్కరించుకో లేకపోవటం మా దురదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి విశాఖ పార్లమెంటరీ సెక్రటరీ పిట్ట సురేష్, 1వ వార్డు ప్రెసిడెంట్ తమ్మిన సూరిబాబు, సీనియర్ నాయకులు మద్దుల దేవుళ్ళు,చిలకా నర్సింగ్ రావు, గరే చంద్రమౌళి,నరవ రామారావు, వైస్ ప్రెసిడెంట్ దొంతల పైడ్రాజు, ఎస్సి సెల్ ప్రెసిడెంట్, సెక్రటరీ మద్దిల సుబ్బారావు, తాటిపూడి అప్పలరాజు, యువత సెక్రెటరీ దండి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్